సుకన్య సమృద్ధి యోజనను సద్వినియోగం చేసుకోవాలి – బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి
బాలికల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి సూచించారు.
2015లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికల పేరుపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా ప్రారంభించవచ్చన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు బాలికల వరకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
2026 ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజనపై కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీ అందిస్తున్నదని చెప్పారు. నెలకు రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉందన్నారు. బాలికకు 18 సంవత్సరాలు పూర్తైన తర్వాత ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం 50 శాతం వరకు నగదు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, పూర్తి మొత్తాన్ని వడ్డీతో సహా 21 సంవత్సరాల తర్వాత పొందవచ్చని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కుటుంబాలు ఈ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు. పోస్టాఫీసులు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ ఖాతాలను ప్రారంభించవచ్చని, ప్రభుత్వ హామీ ఉన్న పథకం కావడంతో భయపడకుండా పొదుపు చేయవచ్చన్నారు.
ఇలాంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.
అలాగే ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని రోజుకు రూ.307 వేతనం పొందేలా పనులకు హాజరు కావాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకర్ బుర్రి కోరారు.