శ్రీకాకుళం తపాలా డివిజన్లో PLI, RPLI డైరెక్ట్ ఏజెంట్ల నియామకం
శ్రీకాకుళం: భారత తపాలా శాఖ శ్రీకాకుళం డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) వ్యాపార విస్తరణ కోసం డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ డివిజన్ సూపరింటెండెంట్ వి. హరిబాబు తెలిపారు.
డైరెక్ట్ ఏజెంట్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ బీమా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, కొత్త పాలసీల నమోదులో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హామీతో అమలవుతున్న PLI, RPLI పథకాలు తక్కువ ప్రీమియంతో అధిక బోనస్, మెరుగైన రాబడితో పాటు కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తాయని వివరించారు.
ఈ నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి, 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఎంపికైన వారికి తపాలా శాఖ ఉచిత శిక్షణ అందించడంతో పాటు, సాధించిన వ్యాపార లక్ష్యాల ఆధారంగా కమిషన్, ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించారు.
ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి మార్కుల జాబితా, వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తదితర పత్రాలతో శ్రీకాకుళం సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం లేదా సమీప ప్రధాన తపాలా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో డివిజనల్ తపాలా కార్యాలయాన్ని లేదా ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.