తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి
తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం దశలవారీగా ప్రస్తుతం ఉన్న పాత విద్యుత్ కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లను అమర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి ఆటోమేటిక్గా విద్యుత్ వినియోగ రీడింగ్ నమోదు అవుతుంది. ఆ వివరాల ఆధారంగా వినియోగదారులకు బిల్లులు పంపించే విధానం అమల్లోకి రానుంది. దీంతో మాన్యువల్ రీడింగ్ ప్రక్రియకు ముగింపు పలకనున్నారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా నగదు చెల్లించి విద్యుత్ వినియోగించే విధానం ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయనున్నారు.
స్మార్ట్ మీటర్ల అమలుతో విద్యుత్ వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు, బిల్లింగ్ లోపాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.