తిమ్మక్కపాలెంలో బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ వల్ల రైతులకు రూ.50 లక్షల నష్టం: బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా చింతలపూడి: లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలో బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ కారణంగా సుమారు రూ.50 లక్షల మేర నష్టపోయిన రైతులకు న్యాయం చేసి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తొర్లపాటి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తిమ్మక్కపాలెంలో సుమారు 25 మంది రైతులకు బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్లు మన్నె రామకృష్ణ, మన్నె ప్రసాద్ శాంపిల్ విత్తనాలు అందించి, ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని, పంట పండినా పండకపోయినా ఎకరానికి రూ.లక్ష చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ముందస్తుగా ఎకరానికి రూ.20 వేల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారని, అయితే చివరకు ఎకరానికి అర టన్ను నుంచి ఒక టన్ను మాత్రమే దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు.
నష్టపరిహారం కోసం రైతులు ఏజెంట్లను పలుమార్లు సంప్రదించినప్పటికీ కొందరికి చెక్కులు ఇచ్చి, మరికొందరికి రేపు, మాపు అంటూ ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ 25 మంది రైతులకు కలిపి సుమారు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులను పలుమార్లు ఆశ్రయించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిమ్మక్కపాలెంలో బాధిత రైతులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. సమావేశంలో మాట్లాడుతూ బేర్ సీడ్ కంపెనీ ఏజెంట్ మన్నె రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ను కలిసి పూర్తి వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం రైతు సంఘం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్గా ఆచంట నాగేశ్వరరావు, సభ్యులుగా కొల్లి శివకృష్ణ, కొల్లి పాపారావు, బోగోలు శ్రీను, మాసిరెడ్డి సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.