తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల.. భక్తులకు కీలక సమాచారం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
మంగళవారం ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
ఈ నెల 20వ తేదీ వరకు ఈ-డిప్ విధానంలో ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. అనంతరం లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి టికెట్లు కేటాయిస్తారు.
అంగ ప్రదక్షిణ టోకెన్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టోకెన్లను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 25వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమలలోని వసతి గదుల బుకింగ్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తులు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆన్లైన్ బుకింగ్ సమయంలో వ్యక్తిగత వివరాలను సరిగ్గా నమోదు చేయాలని కోరింది.