తిరువూరులో నందన్ వైన్స్లో కల్తీ మద్యం విక్రయాల ఆరోపణలు.. అధికారుల చర్యలు కోరుతున్న వినియోగదారులు
తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శ్రీ సూర్య రెస్టారెంట్ సమీపంలో ఉన్న నందన్ వైన్స్లో కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మద్యం నాణ్యతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు వినియోగదారులు వైన్స్ నిర్వాహకులతో వాగ్వాదాలకు దిగుతున్నట్లు సమాచారం.
వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పటికీ, నిర్వాహకులు సరైన స్పందన ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాసిరకం మద్యం విక్రయాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నాటు సారా విక్రయాలపై చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి, నందన్ వైన్స్లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.