తిరువూరులో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి – ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ ధర్నా
తిరువూరులో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి – ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ ధర్నా
తిరువూరు, ఆగస్టు 6: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలను రూ.3,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు పి. వెంకటేశ్వరావు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మండలంలోని పలు ఇంజినీరింగ్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు చెల్లించకపోతే తరగతులకు అనుమతించకుండా, పరీక్షలు రాయనివ్వకుండా ఒత్తిడి తెస్తూ బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్కాలర్షిప్ అర్హతను నిర్ణయించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ విధానం గతంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని, అందువల్ల దానిని పూర్తిగా రద్దు చేయాలని కోరారు.
సంక్షేమ హాస్టళ్లలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మెస్, కాస్మోటిక్ ఛార్జీలు సరిపోవడం లేదని, వాటిని రూ.3,000కు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న వార్డెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఎం. రాఖీ, మండల కార్యదర్శి ఎం. హర్షతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.