ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ
హైదరాబాద్: సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ (సీతక్క), పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోగా, సంప్రదాయ బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాలతో లష్కర్ బోనాల జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా, ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు కొనసాగింది. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ నగరం భక్తిరసంలో మునిగిపోయింది.