Education: విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది: మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి | జూన్ 27 | NTODAY NEWS
ధర్మపురి జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం)గా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన టీ. పుష్పలత పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆమెకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ఆమె సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు అందించే సేవలు అమూల్యమని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలం అంకితభావంతో విధులు నిర్వర్తించిన టీ. పుష్పలత సేవలు చిరస్మరణీయమని ప్రశంసించిన ఆమె, పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం పుష్పలతను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొని పుష్పలతకు శుభాకాంక్షలు తెలిపారు.