32 వేల కోట్లతో విద్యాభివృద్ధి.. 25 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారధి
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏడాది రూ.32 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో మండల స్థాయిలో మొదటి ఐదు స్థానాలు సాధించిన 25 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.3 లక్షల నగదు బహుమతులు అందజేసి దుశ్శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో విద్యకు మించిన ఆస్తి లేదని, పేదల జీవితాలను మార్చగల శక్తి విద్యకే ఉందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, విద్యా కిట్లు అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది డీఎస్సీ ద్వారా 16,600 మంది ఉపాధ్యాయులను నియమించామని, ఈ విద్యా సంవత్సరంలో మరో 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
విద్యాభివృద్ధితో పాటు ఉన్నత చదువులు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం క్వాంటం వాలి, గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటవడంతో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
గత విద్యా సంవత్సరంలో జిల్లాలో ఎస్సెస్సీ ఫలితాలు 72 శాతం నమోదయ్యాయని, ఈసారి 80 నుంచి 90 శాతం వరకు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు రూ.25 వేలు, రెండో స్థానం వారికి రూ.15 వేలు, మూడో స్థానం వారికి రూ.10 వేలు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు రూ.లక్ష, ఎస్సీ విద్యార్థులకు రూ.75 వేలు, బీసీ విద్యార్థులకు రూ.50 వేలు, ఇతరులకు రూ.25 వేలు చొప్పున బహుమతులు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రతి ఏడాది డిసెంబర్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు వంద రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థులకు ఏడు రకాల పౌష్టికాహారంతో కూడిన ఆహార కిట్లు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా నూజివీడులోని కుమార్ స్కూల్లో ఎస్సెస్సీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించిన రజియా బేగంను మంత్రి ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.