2029లో జమిలి ఎన్నికలు? కేంద్రం ఆలోచనలివే!
దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే "ఒకే దేశం - ఒకే ఎన్నిక" (జమిలి ఎన్నికలు) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తరచూ ఎన్నికలు జరగడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
సమాచారం ప్రకారం, 2028 జులైలోపు సంబంధిత బిల్లు చట్టరూపం దాల్చితే 2029 లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. అయితే జమిలి ఎన్నికలను ఒకేసారి పూర్తిగా అమలు చేయకుండా, 2029 నుంచి 2034 వరకు విడతల వారీగా అమలు చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రణాళిక ప్రకారం 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఐదారు నెలలు పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కొంత మేర తగ్గించే అవకాశమూ ఉంది.
అలాగే 2030, 2031లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని ఒకటి లేదా రెండేళ్లు తగ్గించి, వాటిని 2034 లోక్సభ ఎన్నికలతోపాటు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే 2034 నుంచి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.