ఆపరేషన్ స్మైల్ – XII విజయవంతానికి జిల్లా స్థాయి సమన్వయ సమావేశం
NTODAY NEWS: మంచిర్యాల
అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత విభాగాల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అధ్యక్షతన, అలాగే పెద్దపల్లి జోన్ పరిధిలో పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల్లో డబ్ల్యూవో, డీసీపీయూ, సీడబ్ల్యూసీ, కార్మిక, ఆరోగ్య, విద్యాశాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ప్రాంతాలు, అలాగే పెద్దపల్లి జోన్ పరిధిలోని పెద్దపల్లి, గోదావరిఖని సబ్ డివిజన్లలో 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే వారి సమాచారాన్ని సేకరించి తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా బాలకార్మికులు, బిక్షాటనలో ఉన్న పిల్లలు, వదిలివేయబడ్డ పిల్లలను గుర్తించి వారిని సంరక్షణలోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించాలని, బలవంతంగా బిక్షాటన చేయించిన వారిపై, వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్యంతో జనవరి 1 నుంచి జనవరి 31 వరకు “ఆపరేషన్ స్మైల్ – XII” ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి, అతని ఆధ్వర్యంలో నలుగురు పోలీస్ సిబ్బంది మరియు ఒక మహిళా కానిస్టేబుల్ను నియమిస్తామని వెల్లడించారు. వీరు సేకరించిన పూర్తి వివరాలను పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమగ్రంగా నమోదు చేసి, హైదరాబాద్లోని మహిళా భద్రతా విభాగం అధికారులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. తప్పిపోయిన బాలురు, బాలికల సమాచారం లేదా బాలకార్మికులు, బిక్షాటనకు గురవుతున్న పిల్లల గురించి ఏవైనా వివరాలు ఉంటే, ప్రజలు సంబంధిత పోలీస్ అధికారులకు లేదా ప్రకటించిన ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
Follow us on
Website
Facebook
Instagram
YouTube