ఆగస్టు 15లోపు గ్యాస్ కేవైసీ తప్పనిసరి – లేకపోతే సబ్సిడీ నిలిపివేత
ఆగస్టు 15లోపు గ్యాస్ కేవైసీ తప్పనిసరి – లేకపోతే సబ్సిడీ నిలిపివేత
ఖమ్మం జిల్లా, మధిర: గ్యాస్ వినియోగదారులందరూ ఆగస్టు 15లోపు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని మధిరలోని శ్రీ సాయి వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్యాస్ కనెక్షన్దారు కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్ సరఫరాతో పాటు సబ్సిడీ కూడా నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తున్నప్పటికీ అనేక మంది వినియోగదారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. వినియోగదారులు తమ సమీప గ్యాస్ ఏజెన్సీ లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద సులభంగా కేవైసీ చేయించుకోవచ్చన్నారు.
ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే వారికి అందుతున్న రూ.350 సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉందన్నారు. అలాగే కేవైసీ చేయని వినియోగదారులు ఆగస్టు 16 నుంచి కమర్షియల్ ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి రావచ్చని, దీంతో ఒక్క సిలిండర్కు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.
ఈ విషయమై అధికారులు, డీలర్లు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా చాలామంది కేవైసీ పూర్తి చేయలేదని తెలిపారు. చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే కేవైసీ పూర్తి చేసుకుని ఇబ్బందులను నివారించుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.