ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది అర్హులైన లబ్ధిదారులకు టీకాలు వేసి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
సూపర్వైజర్ సురేష్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రత్నమాల, ఆరోగ్య సిబ్బంది పుల్లారావు, అంగన్వాడీ టీచర్ లింగమ్మ, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.