బీసెంట్ రోడ్డులో ఉద్రిక్తత.. హాకర్ల తొలగింపుపై భగ్గుమన్న నిరసనలు
విజయవాడలోని బీసెంట్ రోడ్డులో హాకర్ల తొలగింపు యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయం పోలీసులు, మున్సిపల్ అధికారులు భారీ బందోబస్తుతో తోపుడు బండ్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను తొలగించేందుకు ప్రయత్నించగా, హాకర్లు తీవ్రంగా ప్రతిఘటించారు.
బీసెంట్ రోడ్డులో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వారి ఆందోళనకు సీఐటీయూ నేతృత్వం వహించగా, సీపీఎం, సీపీఐతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. దీంతో బీసెంట్ రోడ్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హాకర్లకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన గుర్తింపు కార్డులు, చెల్లించిన రుసుముల రసీదులు ఉన్నప్పటికీ బలవంతంగా తొలగించడం చట్టవిరుద్ధమని సీఐటీయూ నాయకులు అధికారులను నిలదీశారు. వీధి విక్రయదారుల (జీవనోపాధి రక్షణ, వీధి విక్రయాల నియంత్రణ) చట్టం–2014 ప్రకారం హాకర్ల హక్కులను పరిరక్షించాలని, తొలగింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రాఘవయ్య పార్క్ నుంచి తుమ్మిడి బ్రదర్స్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన హాకర్లు, మున్సిపల్ కమిషనర్తో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. లేనిపక్షంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఎం, సీపీఐ నాయకులు, హాకర్స్ యూనియన్ ప్రతినిధులు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని హాకర్లకు మద్దతు ప్రకటించారు.