చింతలపూడి మాస్టర్ ప్లాన్ అమలు ఇప్పటికైనా జరుగుతుందా?
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి: చింతలపూడి పట్టణ మాస్టర్ ప్లాన్ అమలు ఇప్పటికైనా ప్రారంభమవుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1993లో డీటీసీపీ (DTCP) ఆమోదం పొందిన ఈ మాస్టర్ ప్లాన్కు దాదాపు 33 సంవత్సరాలు గడిచినా అమలు మాత్రం ముందుకు సాగలేదు. ఈ కాలంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మారినా మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది.
ముఖ్యంగా మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన రింగ్ రోడ్డు ఇప్పటికీ నిర్మాణం కాకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపాదిత రింగ్ రోడ్డు మార్గంలో అక్రమ లే అవుట్లు, అనుమతి లేని నిర్మాణాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి ప్రతిపాదిత రింగ్ రోడ్డు మార్గంలోని అక్రమ ఆక్రమణలను తొలగించడం లేదా పరిస్థితులకు అనుగుణంగా అలైన్మెంట్లో మార్పులు చేసి పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అక్రమ లే అవుట్లు, నిర్మాణాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పట్టణ అభివృద్ధికి అనుగుణంగా క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చింతలపూడి మాస్టర్ ప్లాన్కు ఇకనైనా మోక్షం లభించి, కనీసం రింగ్ రోడ్డు నిర్మాణమైనా ప్రారంభమవుతుందా? అనే ప్రశ్నకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాచరణతోనే సమాధానం చెప్పాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.