జాతీయ ఆహార భద్రతా చట్ట సవరణను ఉపసంహరించాలి: సీపీఐ(ఎం)
హైదరాబాద్, జూలై 7: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)లో ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ ప్రాతిపదిక అర్హత విధానాన్ని తొలగించి, వ్యక్తి ప్రాతిపదిక విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనను పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విడుదల చేసిన ప్రకటనలో, ఒక్కో వ్యక్తికి 7 కిలోల ధాన్యం ఇస్తామని చెప్పినా, పెద్ద కుటుంబాలకు అదనపు ప్రయోజనం ఉండదని పేర్కొంది. వారి మొత్తం కోటా ఇప్పటికీ నెలకు 35 కిలోలకే పరిమితమవుతుందని, మరోవైపు చిన్న కుటుంబాలు ప్రస్తుతం పొందుతున్న 35 కిలోల పూర్తి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, చిన్న కుటుంబాలు వంటి అత్యంత బలహీన వర్గాల ఆహార భద్రతపై ఈ సవరణ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి సగటు కుటుంబ పరిమాణాన్ని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలపై ఈ మార్పు ప్రతికూల ప్రభావం చూపుతుందని, జనాభా నియంత్రణలో విజయాలు సాధించినప్పటికీ వాటి ఆహార ధాన్య కేటాయింపులు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
2011 జనగణన ఆధారంగా ఉన్న ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను తాజా జనాభా ప్రకారం నవీకరించి, అర్హులైన ప్రతి కుటుంబాన్ని చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) పేర్కొంది. అలాంటి చర్యలు చేపట్టాల్సిన సమయంలో పేదల ఆహార హక్కులను బలహీనపరిచే సవరణ తీసుకురావడం విచారకరమని విమర్శించింది.
ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఆహార హక్కును బలహీనపరిచే ఈ ప్రతిపాదిత సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.