విద్యార్థులకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తుందని చిట్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం అన్నారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం సర్పంచ్ కాటం వెంకటేశం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో మెనూ రేట్లను పెంచిందన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల ఆహార నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు హరీష్ రెడ్డి, ప్రశాంత్, నరేష్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.