HPCL డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: యూనియన్ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి
బాకరాపేట | NTODAY NEWS
బాకరాపేట సమీపంలోని హెచ్పీసీఎల్ (HPCL) డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, హెల్పర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని హెచ్పీసీఎల్ డ్రైవర్ అండ్ హెల్పర్ యూనియన్ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం డిపోలో కార్మికులతో కలిసి నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా డిపోలో నెలకొన్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విశ్రాంతి వసతులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారిందన్నారు.
డ్రైవర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇంధనాన్ని సురక్షితంగా రవాణా చేయాలంటే వారిపై అనవసర ఒత్తిడి లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా లోడింగ్ ప్రక్రియను సాయంత్రంలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, కార్మికులను గౌరవప్రదంగా చూడడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.
ఈ సందర్భంగా స్పందించిన డిపో డీఎం మాట్లాడుతూ, తాగునీటి కుళాయి ఏర్పాటును అదే రోజు సాయంత్రంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. మిగిలిన వసతుల ఏర్పాటుకు పై అధికారుల అనుమతితో రానున్న నాలుగు నెలల్లో అవసరమైన నిర్మాణ పనులు చేపట్టి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ యూనియన్ కార్యదర్శి వేమ నారాయణరెడ్డి, ఆర్టీయూ నగర కార్యదర్శి మడగలం ప్రసాద్, దస్తగిరి, నాగూర్, మహేంద్ర, వెంకటయ్య, కమల్, రజాక్, రమణనాయుడు, ప్రతాప్ రెడ్డి, మునిరెడ్డి, వెంకటేష్, విజయ్కుమార్తో పాటు హెచ్పీసీఎల్ డ్రైవర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.