పేరంపేటలో దారుణ హత్య.. ఘటనాస్థలికి పరుగెత్తిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారుమూడి దుర్గారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మృతదేహాన్ని చూసిన ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామస్తులను అడిగి హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.
అనంతరం మృతుడు కారుమూడి దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, వారికి ధైర్యం చెప్పారు. దుర్గారెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా పూర్తి అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.
పెరంపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ హత్య ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.