తెరుచుకున్న బడులు.. మొదలైన ఫుడ్ పాయిజన్లు!
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణలోని బీర్కూర్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడంతో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
రోజువారీ మాదిరిగానే రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడడం ప్రారంభించారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగిన వంట నూనెను పదేపదే వినియోగించడం, నాసిరకం ఆహార పదార్థాలను ఉపయోగించడమే ఫుడ్ పాయిజన్కు కారణమని వారు ఆరోపిస్తున్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.