పెనుగొలనులో ఘనంగా మిక్కిలినేని జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు రంగస్థల, సినీ నటుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 1949లో వచ్చిన "దీక్ష" చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి, దాదాపు 400కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు.
అలాగే నటుడిగానే కాకుండా "ఆంధ్రుల నటరత్నాలు", "తెలుగువారి జానపద కళారూపాలు" వంటి విలువైన గ్రంథాలను రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఐదు సార్లు జైలు శిక్షను అనుభవించారని, అనంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుడిగా నిలిచారని కొనియాడారు.
ప్రజానాట్య మండలి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి ముఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయకురాలు దేవర అంజలి, గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొని మిక్కిలినేని సేవలను స్మరించుకున్నారు.