జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం.. పాఠశాలల్లో పండుగ వాతావరణం!
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 17న సందడిగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సందేశం ఇవ్వనున్నారు.
ఈ సమావేశంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్ర విద్యా ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు అందజేయనున్నారు. పిల్లల చదువు, హాజరు, ప్రతిభ, నైపుణ్యాలు, క్రీడలు, ప్రవర్తన తదితర అంశాలపై పూర్తి వివరాలను తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపైకి రావడం ద్వారా విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది పలకనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
"మన పిల్లల భవిష్యత్తు కోసం.. మన పాఠశాలకు తప్పక వెళ్లాలి" అంటూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది.