సాయంత్రానికే మూతపడిన ప్రభుత్వ ఆస్పత్రి..! వైద్య సిబ్బంది గైర్హాజరుతో రోగుల ఆందోళన.. మర్రిచెట్టుపాలెంలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం సుమారు 4:50 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ రోగిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకురాగా, అక్కడ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్యూటీ సమయం ముగియకముందే సిబ్బంది ఆస్పత్రిని వీడి వెళ్లిపోయారని స్థానికులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.
వైద్య సేవల కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్న పేద ప్రజలు ఇలాంటి పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.