ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ / NTODAY NEWS
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టామని, ప్రస్తుతం ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఫారాలను ఓటర్లు పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి సేకరించి, సంబంధిత బీఎల్వో యాప్లో డిజిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్లకు ఫారాలు నింపడంలో వాలంటీర్ల సహాయం అందించాలని, డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జూలై 20 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తప్పుడు సమాచారం సమర్పించిన ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లు, వాలంటీర్లు అవసరమైన సహకారం అందించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, డిజిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను పకడ్బందీగా చేపడతామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో కార్యాచరణ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.