గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది--ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నిర్మాణంలో ఉన్న ఇళ్లను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసలమర్రి గ్రామంలో సోమవారం రోజున ఉదయం ప్రభుత్వం విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారుల తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లకు సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, లబ్ధిదారులతో సమన్వయం చేసుకుని వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనుల్లో జాప్యానికి తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.గ్రామంలో చివరి దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.అలాగే గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఎక్కడా లోటు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.