పుట్రేల గాజుల చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
అనుమతులు ఒకచోట.. మట్టి డంపింగ్ మరోచోట.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవు : ఇరిగేషన్ డీఈ అర్జున్రావు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని గాజుల చెరువు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా జరుగుతోందన్న ఫిర్యాదుల మేరకు నూజివీడు ఇరిగేషన్ డీఈ వై. అర్జున్రావు, జేఈ సలీం సోమవారం చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఈ అర్జున్రావు మాట్లాడుతూ.. వీరరాఘవపురం గ్రామానికి చెందిన కోనేరు శివదీప్కు సంబంధించిన ఆర్ఎస్ నంబర్ 750/2సీ పరిధిలోని 2.40 సెంట్ల భూమిని మెరక చేసుకునేందుకు గాజుల చెరువు నుంచి 750 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు జూలై 3వ తేదీన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అయితే, ఎఫ్డీఆర్ లెడ్ డ్యామేజ్ రీస్టోర్ పనులు జరుగుతున్న కారణంగా జూలై 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మట్టి తవ్వకాలను నిలిపివేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కోనేరు శివదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజుల చెరువును పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుల ఆరోపణల ప్రకారం.. గత జూన్ 1 నుంచి జూన్ 24 వరకు సుమారు 10 వేల ట్రక్కుల మట్టిని గాజుల చెరువు నుంచి ఇటుక బట్టీల యజమానులకు తరలించినా అధికారులు పట్టించుకోలేదని, తమ సొంత భూమిని మెరక చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేయడం అన్యాయమని వారు వాపోయారు.
ఇదే సమయంలో వీరరాఘవపురం గ్రామానికి చెందిన గాదే రమేష్కు సంబంధించిన ఆర్ఎస్ నంబర్లు 745-1, 745-2, 745-3 పరిధిలోని మొత్తం 2 ఎకరాల 13 సెంట్ల భూమిని మెరక చేసుకునేందుకు కూడా ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
అనుమతులు ఒకచోట తీసుకుని, మట్టిని మరోచోట డంపింగ్ చేయడం, అక్రమంగా మట్టి విక్రయాలు జరపడం వంటి అంశాలపై విచారణ జరుపుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈ అర్జున్రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గాదే రమేష్కు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.