బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలోని అంబేద్కర్-జగజీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి. హరినాథ్ ప్రసంగించారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసే దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం పాలనలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఉప రాజద్రోహ చట్టాలను ప్రయోగించి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదుల గొంతు నులిమే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
బాబు జగజీవన్ రామ్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, ఐదు దశాబ్దాల పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని హరినాథ్ అన్నారు. దళితుల ఓటు హక్కు పరిరక్షణతో పాటు కార్మిక మంత్రిగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడారని గుర్తుచేశారు.
రాముడి పేరును జపించే బీజేపీ పాలనలో బాలరాముడికి భక్తులు సమర్పించిన నగలు, ఆభరణాలు, కానుకలు చోరీ కావడం అవినీతికి పరాకాష్టగా నిలిచిందని ఆయన విమర్శించారు. ప్రజల ఒత్తిడి మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినప్పటికీ అసలు దోషులను వదిలి చిన్నస్థాయి వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరినాథ్ విమర్శించారు.
ఈ సభకు రాజ్కుమార్ అధ్యక్షత వహించగా, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ పల్లెపాము లక్ష్మయ్య ముగింపు ఉపన్యాసం చేయడంతో సభ ముగిసింది.