ప్రభుత్వ పాఠశాల ఆయా, శానిటేషన్, నైట్ వాచ్మెన్ వర్కర్ల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఆయా అండ్ నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశాకు ఆయా వర్కర్ల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, శానిటేషన్ సిబ్బంది, నైట్ వాచ్మెన్లకు నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నెలకు రూ.6,000 వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీతాలు పెంచాలని కోరారు.
అలాగే ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందించడంతో పాటు పదవీ విరమణ అనంతరం రూ.2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షలు లేకుండా, పని ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా తమను గౌరవంగా చూడాలని కోరారు.
వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీశా స్పందిస్తూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీతాల పెంపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, జిల్లా కార్యదర్శి కొప్పుల కుమార్, విజయవాడ నగర ఐఎఫ్టీయూ కార్యదర్శి రవీంద్ర, నాయకులు శ్రీనివాసరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆసియా, కోనేరు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు, ప్రభుత్వ పాఠశాల ఆయా అండ్ శానిటేషన్ నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కోనేరు లక్ష్మి, కార్యదర్శి కౌసల్య, వై. లక్ష్మి, ఎస్కే మైము, ప్రేమజ్యోతి, లక్ష్మి తదితర పాఠశాల ఆయా వర్కర్లు పాల్గొన్నారు.