ఆర్టీజీఎస్ సీసీటీవీ360డిగ్రీల సహకారంతో తప్పిపోయిన తుమ్మగూడెం గ్రామానికి చెందిన మహిళను గుర్తించిన చాట్రాయి పోలీసులు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ 16-06-2026 తేదీన కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందింది. సమాచారం అందిన వెంటనే చాట్రాయి ఎస్ఐ డి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.
దర్యాప్తును వేగవంతం చేయడానికి మహిళ ఫోటోను అదే రోజు రాత్రి 11.00 గంటలకు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 డిగ్రీల ప్లాట్ఫారమ్లో అప్లోడ్ చేశారు. ఈ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ నెట్వర్క్ ద్వారా విశ్లేషణ జరిపి సంబంధిత సమాచారాన్ని సేకరించింది.
తదుపరి రోజు ఉదయం ఏలూరు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి మహిళ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం అందింది. వెంటనే స్పందించిన చాట్రాయి పోలీసులు ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని మహిళను సురక్షితంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తరువాత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆమె ఇంటి నుండి వెళ్లిపోవడానికి గల కారణాలను తెలుసుకుని అవసరమైన సూచనలు అందించారు. అనంతరం ఆమె క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్ ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా తక్కువ సమయంలోనే మహిళను గుర్తించడం సాధ్యమైంది.
ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కుటుంబ సభ్యులు లేదా బంధువులు కనిపించకుండా పోయిన సందర్భంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఫోటో మరియు వివరాలు అందిస్తే త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.