యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులతో చర్చ
యలమంచిలి | Ntoday News
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యలమంచిలి నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీ దేముళ్ళు (SLD) కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణుల సన్నద్ధత, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన పలు విస్తృత స్థాయి సమావేశాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ప్రధాన అంశాలుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సమావేశానికి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.