ఆయిల్పామ్ రైతులపై నీటి దందా.. దళారుల మాయాజాలంతో భారీ నష్టం
ఆయిల్పామ్ రైతులపై నీటి దందా.. దళారుల మాయాజాలంతో భారీ నష్టం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో నవభారత్ గోద్రెజ్ ఫ్యాక్టరీకి వెళ్లే ఆయిల్పామ్ గెలల విషయంలో అక్రమాలు?
వే బ్రిడ్జి కాటాల వద్ద నీళ్లు కొట్టి బరువు పెంచుతున్నారని రైతుల ఆరోపణలు
కష్టపడి సాగు చేస్తున్న ఆయిల్పామ్ రైతులను దళారీ వ్యవస్థ తీవ్రంగా నష్టపరుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిధిలోని కొన్ని వే బ్రిడ్జి కాటాల వద్ద నవభారత్ గోద్రెజ్ ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్పామ్ గెలల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుల నుంచి సేకరించిన ఆయిల్పామ్ గెలలను కాటాల వద్ద నిల్వ ఉంచి, రాత్రి సమయాల్లో వాటిపై నీళ్లు చల్లడం ద్వారా బరువు పెంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా పెరిగిన బరువుతో లోడ్లు ఫ్యాక్టరీలకు చేరిన తర్వాత, గెలల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ధర తగ్గిస్తున్నారని చెబుతున్నారు.
దళారుల లాభాల కోసం జరుగుతున్న ఈ వ్యవహారంలో నష్టపోతున్నది మాత్రం రైతులేనని వారు వాపోతున్నారు. ఇప్పటికే గత నెలలో టన్నుకు రూ.450 వరకు ధర తగ్గిందని, దీనివల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయిల్పామ్ రైతులు తెలిపారు.
పంట కోసం పెట్టుబడులు పెట్టి, నెలల తరబడి శ్రమిస్తున్న రైతులకు న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. వే బ్రిడ్జి కాటాల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఉద్యానవన శాఖ అధికారులు, సంబంధిత యంత్రాంగం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాటాల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నీళ్లు కలిపే విధానానికి అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. దళారుల మోసాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారులు స్పందించకపోతే రైతుల తరఫున ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయిల్పామ్ రైతులు హెచ్చరిస్తున్నారు.