ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో చిరుధాన్యాల చిక్కీలు – విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు వేరుశనగతో తయారైన చిక్కీలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై చిరుధాన్యాలు కలిపిన ప్రత్యేక చిక్కీలను కూడా సరఫరా చేయడం ప్రారంభించింది.
వేరుశనగ, బెల్లం, జొన్న, సజ్జల వంటి చిరుధాన్యాలతో తయారైన ఈ కొత్త చిక్కీలు ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేశారు. పిల్లల ఆహారంలో పోషక విలువలు పెంచడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు చిరుధాన్యాలను విద్యార్థుల రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.
మధ్యాహ్న భోజన పథకం విభాగం డైరెక్టర్ బి.నివాసరావు తెలిపిన ప్రకారం, భవిష్యత్తులో మరిన్ని పోషకాహార మార్పులు తీసుకురావాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.