ఏపీలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు అమరావతి: ఏపీలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో కమిషనరేట్ల ఏర్పాటు కోసం పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే ప్రస్తుతం ఉన్న విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లకు అదనంగా మరో నాలుగు కమిషనరేట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఆరు పోలీస్ కమిషనరేట్లు పనిచేసే అవకాశం ఉంటుంది.
కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా నగరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు సంబంధించిన తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది.