అండర్పాస్ పనులు పూర్తి చేయకపోతే ఆందోళన: సీపీఎం హెచ్చరిక
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్కు సీపీఎం నేతల సంతాపం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండారు జనార్ధన్ (67) కడవరకు కమ్యూనిస్టు అభిమానిగా ఉన్నారని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సభ్యులతో కలిసి జనార్ధన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ చిట్యాల జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అండర్పాస్ వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనార్ధన్ వంటి వారు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారని, ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోతే పనులు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
అండర్పాస్ పనులు నత్తనడకన సాగుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక మంది గాయాలపాలు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు, అండర్పాస్ పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఇతర రాజకీయ పక్షాలతో కలిసి ఆందోళనలు, పోరాటాలు చేపడుతుందని హెచ్చరించారు. అనంతరం జనార్ధన్ అంత్యక్రియల్లో సీతారాములు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్రెడ్డి, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహ, గుడిసె లక్ష్మీనారాయణ, లడే రాములు, అక్కెనపల్లి నాగయ్య, ప్రజా సంఘాల నాయకులు ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, బొడ్డు బాబురావు, సిలివేరు యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.