www.ntodaynews.com
అన్నారం ప్రభుత్వ బడిలో ఘనంగా బోనాల పండుగ..
తెలంగాణ
/
నిజామాబాద్
/
ఆర్మూర్
డొంకేశ్వర్, ఆగస్టు 07: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు మన ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ఈ ముందస్తు బోనాల సంబరాలను అట్టహాసంగా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినులు సాంప్రదాయ లంగా ఓణీలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు.పసుపు, కుంకుమ, వేప ఆకులతో అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకొని
స్కూల్ ఆవరణ నుండి స్థానిక పోచమ్మ ఆలయం వరకు నిర్వహించిన విద్యార్థుల ఊరేగింపు గ్రామంలో పండుగ శోభను తీసుకువచ్చింది. డప్పు చప్పుళ్ల మోత, విద్యార్థుల పోతురాజు వేషధారణలు, శివసత్తుల పూనకాల మధ్య సాగిన ఈ ప్రదర్శన గ్రామ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకు చిన్నతనం నుంచే మన పండుగల విశిష్టత తెలుస్తుందని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.