అత్యాచార బాధిత చిన్నారికి వైద్యం నిరాకరణ.. వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
అత్యాచార బాధిత చిన్నారికి వైద్యం నిరాకరణ.. వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఘాజియాబాద్లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి అత్యవసర వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేసిన ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, "మీరు మీ విధి నిర్వర్తించకపోతే పేరుకు ముందు 'డాక్టర్' అని రాసుకునే హక్కే లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోయినా బాధిత చిన్నారిని వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వైద్యులదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. పేద కుటుంబానికి చెందిన చిన్నారికి ఫీజులు చెల్లించలేరనే కారణంతో నిర్లక్ష్యం చేశారా అని వైద్యులను ప్రశ్నించింది.
బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని సంబంధిత ఆస్పత్రులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.