హుస్నాబాద్ రహదారి పనులకు ఇక వేగం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ఎల్కతుర్తి జంక్షన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రమాదాల నివారణకు రహదారి విస్తరణపై చర్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 4: హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రహదారులు, కల్వర్టులు, రైల్వే వంతెన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గురువారం సచివాలయంలో కలిసి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు.
ఇప్పటికే మంజూరైన పనుల పురోగతి, ఇంకా ప్రారంభం కావాల్సిన పనులు, కొత్తగా ప్రతిపాదించిన రహదారుల వివరాలను మంత్రులు సమీక్షించారు. ముఖ్యంగా సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. రహదారిపై నిర్మించాల్సిన కల్వర్టుల పనులను కూడా వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
మిట్టపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే వంతెన పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని వివరించారు.
ఎల్కతుర్తి జంక్షన్పై ప్రత్యేక దృష్టి
ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట వైపు వెళ్లే రహదారులు కలిసే ప్రాంతం ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పొన్నం ప్రభాకర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలో రహదారి విస్తరణ చేపట్టి ప్రమాదాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.
అదేవిధంగా కరీంనగర్–ఎల్కతుర్తి, ఎల్కతుర్తి–హనుమకొండ మధ్య కొనసాగుతున్న రహదారి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎల్కతుర్తి జంక్షన్ను విస్తరించి రహదారిలో ఏర్పడిన ఇరుకుదనం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రహదారులు, కల్వర్టులు, రైల్వే వంతెన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.