బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. పీడీయాక్ట్ కింద అరెస్ట్
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. అక్రమంగా బియ్యం సేకరించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోంది.
ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్కు చెందిన బచ్చు రత్నాకర్పై పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రత్నాకర్ గతంలో కూడా బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఆరుసార్లు పోలీసులకు చిక్కినప్పటికీ తన కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.
రేషన్ లబ్ధిదారులు, డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి వడ్డేపల్లి రైస్ మిల్లులో నిల్వ ఉంచి, అనంతరం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తరచూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనిపై పీడీయాక్ట్ అమలు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.