బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా.
బలకవారిపల్లి, అమ్మడుగూరు:
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా అమ్మడుగూరు మండలంలోని చీకిరేవులపల్లి పంచాయతీ పరిధిలోని బలకవారిపల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదం పంపిణీ చేయగా, మూడు రోజుల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు విరాళాలు అందించిన దాతలను గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు.
వేద పండితులు సీదిరెడ్డిపల్లి నాగేంద్రశర్మ కుమారుల ఆధ్వర్యంలో, పలువురు వేద పండితుల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గ్రామస్తులు అందరూ ఏకతాటిపై నడుస్తూ తక్కువ సమయంలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని భక్తులు కొనియాడారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బలకవారిపల్లి గ్రామస్తులు, భక్తులు, దాతలు, వేద పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయ సేవలో తమ వంతు సహకారం అందించారు.