పొలవరం జడ్పీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పొలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతిభావంతులైన విద్యార్థులకు గ్రామ ప్రముఖులు నగదు బహుమతులు అందించారు.
పాఠశాలలో 572 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన గద్దల ఉజ్వల కౌశిక్, 571 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన ఉండి నాగ మౌనేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ ప్రముఖులు మోరంపూడి శ్రీనివాసరావు రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించారు. కొండా విజయరత్నరాజు, రాజశేఖర్ కూడా రూ.15 వేల నగదు బహుమతులు అందించారు.
గత నెలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పానుగంటి సూరిబాబు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.15 వేలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతులు అందించిన విషయం తెలిసిందే.
అలాగే పోతనపల్లి గ్రామం నుంచి ఆటోలో పాఠశాలకు వచ్చి చదువుకుంటున్న 9వ తరగతి విద్యార్థులు ఏడుగురికి విస్సన్నపేటకు చెందిన ఎన్నారైలు శిరం సీతామహాలక్ష్మి, సుకన్యా నటరాజన్ రూ.35 వేల వ్యయంతో కొనుగోలు చేసిన ఏడు సైకిళ్లను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరిడి చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యులు వేముల చిన వెంకటేశ్వరరావు, కేవీఆర్ రాజు, పానుగంటి సూరిబాబు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సత్తినపల్లి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పొలవరం పీఏసీఎస్ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు, గ్రామ పెద్దలు వసుపులేటి నాగేశ్వరరావు, బిలుగిడి పి. విజయకుమార్ రాజు, పజ్జూరి జయరాజు, చెన్నారావు తదితరులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను గుర్తు చేశారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.