సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
నల్గొండ, ఆగస్టు 15: NTODAY NEWS
నల్గొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు ప్రవేశించి సీపీఎం నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.
సుందరయ్య భవన్లో ఉన్న సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సీపీఎం నాయకులు దండంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, బొల్లు రవీందర్ తదితరులపై పోలీసులు దాడి చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రాజకీయ పార్టీ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పార్టీ కార్యాలయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజా నాయకులపై దాడులకు పాల్పడటం సరికాదని విమర్శించారు.
పోలీసులు ప్రజల పట్ల, ప్రజా నాయకుల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. పోలీసులంటే ప్రజలకు రక్షణగా ఉండాలే తప్ప, పోలీసులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడకూడదని అన్నారు.
సీపీఎం కార్యాలయంలోకి ప్రవేశించి నాయకులపై దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.