బోడేపూడి అంటే ప్రజల గుండెల్లో చెరగని చరిత్ర: మద్దాల ప్రభాకరరావు
ఖమ్మం జిల్లా, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
సీపీఎం ఎర్రుపాలెం శాఖ కార్యదర్శి దూదిగం బసవయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ బోడేపూడి వెంకటేశ్వరరావు జీవితం ఓ తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ మధిర ఎమ్మెల్యేగా రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.
శాసనసభ్యుడు అంటే హైదరాబాద్లో నివసించడం కాదని, సాగర్ జలాల సాధన కోసం కాల్వగట్టలపై తిరుగుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరిత్ర బోడేపూడి వెంకటేశ్వరరావుదేనని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచినీటి సౌకర్యం, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన నిస్వార్థంగా పనిచేశారని గుర్తుచేశారు.
రైతులు, పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ చేపట్టే ప్రతి పోరాటానికి బోడేపూడి వెంకటేశ్వరరావు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల వల్ల రైతులు వ్యవసాయ రంగానికి క్రమంగా దూరమవుతున్నారని విమర్శించారు. విత్తనాలు, గిట్టుబాటు ధరలు, ఎరువులు, పురుగుమందుల సబ్సిడీల నుంచి రైతులను దూరం చేసే విధానాలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నూతన ఆర్థిక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అమలుతో రైతుల పరిస్థితి మరింత దిగజారిందని, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గామసు జోగయ్య, నాగులవంచ వెంకటరామయ్య, నక్కా పుల్లారావు, గొబ్బూరి కృష్ణంరాజు, అంజయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.