భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఎసీసీ క్వారీ బ్రిడ్జి మరియు రాళ్లవాగు బ్రిడ్జిని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెనల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో నష్టం వివరాలను తెలుసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనలను అత్యవసర ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు, శాశ్వత మరమ్మతులను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు