ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
విజయవాడ / Ntoday News: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ముగిసింది. పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 25 అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, భద్రత, క్యూలైన్లు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా బొర్రా గాంధీ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి దసరా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత దసరా సమయంలో పాలక మండలి లేకపోవడంతో ఏర్పాట్లను ఈసారి పాలక మండలి సభ్యులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.
విద్యుత్ ఏర్పాట్లు, క్యూలైన్లు, పెయింటింగ్ తదితర పనులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దసరా ఉత్సవాలకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసే సమయంలో వారి గత అనుభవాన్ని పరిశీలించిన అనంతరం కాంట్రాక్టులు అప్పగిస్తామని వెల్లడించారు.
అమ్మవారి ఆలయం తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈసారి ఆర్జిత సేవలను కొత్తగా నిర్మించిన భవనంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆర్జిత సేవలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఈవో సీనానాయక్ మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దసరా ఉత్సవాలను సాధ్యమైనంత వరకు తక్కువ సంఖ్యలో పోలీసు సిబ్బందితో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఉత్సవాల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించనున్నట్లు వెల్లడించారు.
సామాన్య భక్తులకు ఉచిత దర్శనం కల్పించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, ఈ దర్శనానికి టికెట్ల