కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
కొత్తపేట / NToday News: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
అనంతరం నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులతో పాటు మండల పార్టీ బాధ్యతలు చేపట్టిన నాయకులకు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులను అందజేశారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తూ వారికి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని సూచించారు.
ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, పాలనకు సంబంధించిన అంశాలను గడపగడపకు తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.