జి. కొత్తూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ఖరీఫ్లో 9,610 హెక్టార్లలో పంటల సాగు.. రైతులు e-పంట నమోదు చేసుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం జి. కొత్తూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పి. పద్మ రైతులకు పంటల సాగు, ఎరువుల వినియోగం, పంట నమోదు, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పలు సూచనలు చేశారు.
ఆమె మాట్లాడుతూ 2026 ఖరీఫ్ సీజన్కు తిరువూరు మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 8,434 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 9,610 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పంటలకు నీటి ఎద్దడి పెద్దగా లేకపోయినప్పటికీ వాతావరణం అధిక వేడిగా ఉండటంతో కొన్ని పొలాల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
బెట్ట పరిస్థితులు ఉన్న పొలాల్లో అవసరమైన ఎరువులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ రూపంలో అందించడం ద్వారా పంటలకు ప్రయోజనం కలిగించవచ్చని రైతులకు సూచించారు. పంటల పరిస్థితిని బట్టి వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని కోరారు.
ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో సాగు చేసుకునేందుకు టిబీజీ రకం మినుము విత్తనాలు 80 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖాళీ భూముల్లో మినుము సాగు చేపట్టాలని సూచించారు.
24వ విడత పీఎం కిసాన్ నిధులు పొందాలంటే e-KYC తప్పనిసరి అని పి. పద్మ స్పష్టం చేశారు. పథకం ద్వారా లబ్ధి పొందే ప్రతి రైతు నిధుల విడుదలకు ముందుగానే తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలని తెలిపారు.
అలాగే రైతులు తాము సాగు చేసిన పంటలను తప్పనిసరిగా e-పంటలో నమోదు చేయించుకోవడంతో పాటు పంట నమోదు e-KYCను కూడా పూర్తి చేయించుకోవాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, పంటల బీమా తదితర ప్రయోజనాలు అందేందుకు పంట నమోదు కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.