2028లో బీజేపీతో పొత్తు ఉండదు: కేటీఆర్
దామాషా ప్రకారం లోక్సభ స్థానాలు పెంచితే డీలిమిటేషన్కు మద్దతు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
సోనిపట్, హర్యానా | సెప్టెంబర్ 16 | Ntoday News
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో “Innovation in Governance: The Story of a Startup State” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చిన అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2028 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా అని విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. “బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు” అని స్పష్టం చేశారు.
దామాషా ప్రకారం డీలిమిటేషన్కు మద్దతు
డీలిమిటేషన్ అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో బీఆర్ఎస్కు అభ్యంతరం లేదన్నారు.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్న కేటీఆర్.. మొత్తం స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్కు మద్దతు ఇస్తామని తెలిపారు.
ఏఐను స్వీకరించి ముందుకు సాగాలి
కృత్రిమ మేధస్సు, సాంకేతిక మార్పులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని, ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని పేర్కొన్నారు. సాంకేతిక మార్పులను స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ అభివృద్ధి, ఇన్నోవేషన్పై ప్రసంగం
తన ఉపన్యాసంలో తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని “సెర్టెయింటీ–పాజిబిలిటీ” అనే రెండు భావనల ద్వారా కేటీఆర్ వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవల ద్వారా ప్రజలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఇన్నోవేషన్, వ్యవస్థాపకతకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కరువు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే ఇంజినీరింగ్ పరిష్కారంగా అభివర్ణించారు. 2014–15లో సుమారు 44.4 లక్షల టన్నులుగా ఉన్న తెలంగాణ వరి ఉత్పత్తి 2023–24లో 168.8 లక్షల టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ సంస్థల పాత్రను కేటీఆర్ వివరించారు. ఇంక్యుబేషన్, ప్రోటోటైపింగ్ నుంచి మార్కెట్కు సిద్ధమైన సంస్థగా ఎదిగిన స్కైరూట్ను తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థకు ఉదాహరణగా ప్రస్తావించారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు రాజకీయాలు, ప్రజా విధానాలు, డీలిమిటేషన్, ఏఐ, సాంకేతిక పరిణామాలపై కేటీఆర్ను ప్రశ్నించారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కూడా ఆయన “Innovation in Governance: The Story of a Startup State” అంశంపై Distinguished Public Lecture ఇచ్చినట్లు ధృవీకరించింది.