భయంకరంగా ఏనుగుల స్వైరవిహారం.. రూ.లక్షల్లో రైతులకు పంట నష్టం
భయంకరంగా ఏనుగుల స్వైరవిహారం.. రూ.లక్షల్లో రైతులకు పంట నష్టం
అన్నమయ్య జిల్లా, జూలై 19: అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం జిల్లేళ్లమంద సమీప అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు స్వైరవిహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగైదు రోజులుగా సంచరిస్తున్న గజరాజులు శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మామిడి, కొబ్బరి, అరటి తోటలపై దాడి చేసి భారీ నష్టం కలిగించాయి.
ఏనుగులు మామిడి, కొబ్బరి చెట్లను నేలమట్టం చేయడంతో పాటు సాగునీటి పైపులు, కంచెలు, రాతి కూసాలను ధ్వంసం చేశాయి. దీంతో జిల్లేళ్లమంద గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రూ.లక్షల్లో నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏనుగుల బెడదను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.