చాట్రాయి తహశీల్దార్ శ్వేతకు ఉత్తమ తహశీల్దార్ ప్రశంసాపత్రం
చాట్రాయి తహశీల్దార్ శ్వేతకు ఉత్తమ తహశీల్దార్ ప్రశంసాపత్రం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి తహశీల్దార్ శ్వేత ఉత్తమ తహశీల్దార్గా గుర్తింపు పొందారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
చాట్రాయి తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల స్వల్ప కాలంలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, అందుబాటులో ఉండే అధికారిగా తహశీల్దార్ శ్వేత ప్రజల మన్ననలు పొందారు. ఈ సమయంలోనే ఆమె సేవలను గుర్తించి ఉత్తమ తహశీల్దార్ ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో విధి నిర్వహణలో చూపిన అంకితభావం, ప్రభుత్వ పథకాల అమలులో వేగవంతమైన చర్యలు, ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించడాన్ని గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ శ్వేత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రెవెన్యూ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ పారదర్శక పాలన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
చాట్రాయి మండలానికి చెందిన పలువురు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహశీల్దార్ శ్వేతకు అభినందనలు తెలిపారు. ఆమె సేవలు మరింత కొనసాగి మండల అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.